CM Chandrababu: ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా త్వరలోనే దేశ ఆర్థిక పవర్ హౌస్గా అవతరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సింగపూర్లో నిర్వహించిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ బిజినెస్ రోడ్షోలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు వివరించారు. వికసిత్ భారత్-2047 విజన్కు అనుగుణంగా స్వర్ణాంధ్ర-2047 విజన్ను రూపొందించామని చంద్రబాబు తెలిపారు. సుదీర్ఘ తీరప్రాంతం, సమృద్ధిగా లభించే ఖనిజ సంపద, వ్యవసాయం, ఆక్వా, హార్టికల్చర్, సేవారంగాల్లో ఉన్న అవకాశాలు ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా నిలిపాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అనుకూలంగా 26 కొత్త పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు. భూమి, నీటి లభ్యతతో పాటు కృష్ణా, గోదావరి నదుల ద్వారా పారిశ్రామిక అవసరాలకు తగిన వనరులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు చంద్రబాబు.. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకంగా, వేగవంతంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దే లక్ష్యంతో “వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్రెన్యూర్” విధానాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆరు ఆపరేషనల్ పోర్టులు, ఏడు విమానాశ్రయాలు ఉన్నాయని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే ప్రపంచ నగరాలతో మరింత మెరుగైన అనుసంధానం ఏర్పడుతుందని చెప్పారు. పోర్టులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించే రహదారి, రైల్వే నెట్వర్క్లను కూడా విస్తరిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, స్పేస్, డ్రోన్, డిఫెన్స్ రంగాలకు ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని, వీటికి అవసరమైన నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేస్తున్నామని చెప్పారు ఏపీ సీఎం..
రాయలసీమలోని పుట్టపర్తి వద్ద ఐదో తరం ఫైటర్ జెట్ తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అలాగే విశాఖపట్నం సమీపంలో త్వరలోనే సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. విద్య, విజ్ఞానం, సాంకేతికతకు కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని, హైస్పీడ్ రైలు నెట్వర్క్ ద్వారా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తామని తెలిపారు.
అమరావతిలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టి సంస్థల సహకారంతో 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి అది పని చేయడం ప్రారంభిస్తుందని వెల్లడించారు. అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగానికి కూడా అపార అవకాశాలు ఉన్నాయని, దేవాలయాలు, బౌద్ధ సర్క్యూట్లు, ప్రకృతి అందాలు ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఆక్వా, వ్యవసాయం, హార్టికల్చర్ రంగాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. “ఏపీకి వచ్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను పరిశీలించండి. ఆ తర్వాత పెట్టుబడులు పెట్టండి. ఇది పెట్టుబడులకు సువర్ణావకాశం. ఇండియా గ్రోత్ స్టోరీలో భాగస్వాములు కావాలని ప్రపంచ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నాను” అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

