NTV Telugu Site icon

Cabinet Sub-Committee: గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం.. రైతులందరికీ బీమా అమలు..

Cabinet Sub Committee

Cabinet Sub Committee

Cabinet Sub-Committee: రైతులకు శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. రైతులందరికీ బీమా అమలు చేయాలని.. విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరిగాలని.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. స్పష్టం చేశారు.. పంట బీమాపై జరిగిన కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు.. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ బీమా అమలు చేయాలని, విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరగాలని అధికారులను ఆదేశించారు. పంటల బీమాపై వ్యవసాయ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రులు.. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధానాల్లో ఉత్తమ విధానం బీమాకు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు..

Read Also: Viral Dance: ఢిల్లీ మెట్రోలో మరో కళాఖండం.. చూసారా..?

ఇక, గత వైసీపీ ప్రభుత్వంలో బీమా వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, ప్రీమియం చెల్లింపులు జరగలేదని విమర్శించారు మంత్రులు.. విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరిగేలా బీమా అమలు కావాలని సూచించారు.. దిగుబడి బట్టి, వాతావరణ పరిస్థితుల బట్టి బీమా అమలులో ఉన్న అవకాశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.. బీమా అమలు, క్లైమ్ లు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపారు. వైసీపీ ప్రభుత్వంలో మామిడి రైతులకు బీమా అమలు చేయలేదని, తిరిగి ఈ ప్రభుత్వంలో మామిడి రైతులకు బీమా అమలు చేసే అవకాశాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఉద్యాన, మత్స్య శాఖల కార్యదర్శి అహ్మద్ బాబు, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, ఉద్యాన శాఖ కమిషనర్ కె.శ్రీనివాసులు.. ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.