Botsa Satyanarayana: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ రోజు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ మోషేన్రాజు తన చాంబర్లో.. బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. కాగా, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి పోటీకి దూరంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించిన నేపథ్యంలో.. వైసీపీ నుంచి బొత్స మాత్రమే బరిలో ఉండడంతో.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం విదితమే..
Read Also: Brookfield to Invest in AP: ఏపీలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. ముందుకొచ్చిన బ్రూక్ఫీల్డ్
ఇక, ఈ సందర్భంగా బొత్సను అభినందించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా వైఎస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. స్ధానిక సంస్ధల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ప్రమాణ స్వీకారం చేసేముందు వైఎస్ జగన్ను బొత్స కలవడంతో.. ఆయను అభినందించారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు ఆర్.మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, విశాఖ జెడ్పీ ఛైర్మన్ జల్లి సుభద్ర, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అదీప్ రాజ్, భాగ్యలక్ష్మి, కడుబండి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, శోభా హైమావతి, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పలువురు ఉత్తరాంధ్ర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
