Aarava Sridhar controversy: రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నేత అరవ శ్రీధర్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపింది.. సదరు మహిళ వరుస వీడియోలు విడుదల చేయడంతో సంచలనంగా మారింది.. అయితే, అరవ శ్రీధర్ వ్యవహారంపై స్పందించిన జనసేన సీనియర్ నేత, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరువు తీస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారిగా అధికారంలోకి రావడంతో కొందరు దారి తప్పుతున్నారని అభిప్రాయపడ్డారు. అరవ శ్రీధర్ వ్యక్తిగత విషయాలను పార్టీపై రుద్దడం సరైంది కాదని బొలిశెట్టి పేర్కొన్నారు. చిన్న స్థాయి వ్యక్తులను ఎమ్మెల్యేలు చేస్తే, వారు బాధ్యతగా వ్యవహరించాల్సిందిపోయి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే అది పవన్ కల్యాణ్ పరువు తీసినట్టేనని వ్యాఖ్యానించారు.
Read Also: రూ.7,499కే HD+ LCD స్క్రీన్, IP64 రేటింగ్, Android 15 Goతో Lava Yuva Star 3 లాంచ్..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పోరాటం చేసి, కష్టపడ్డాం.. జైళ్లకు కూడా వెళ్లి కేసులు ఎదుర్కొని ఎమ్మెల్యేలు అయ్యామని గుర్తుచేశారు బొలిశెట్టి శ్రీనివాస్… కానీ కొంతమంది ఒక్కసారిగా అధికారాన్ని చూసి దారి తప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, అసెంబ్లీ సమావేశాలకు రావడానికి మొహం చెల్లడం లేదేమోనని వ్యాఖ్యానించిన ఆయన, ఎక్కడా కూడా అసెంబ్లీకి రావద్దని అరవ శ్రీధర్కు చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం మరియు పార్టీ కార్యక్రమాలలో మాత్రమే పాల్గొనవద్దని పార్టీ ఆదేశించిందని వెల్లడించారు జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. కాగా, ఈ వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
