AP New Zonal System: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రపతి ఉత్తర్వులు–2025కు అనుగుణంగా స్థానిక (లోకల్) క్యాడర్ల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను చేపడుతూ సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం మూడు అంచెల కమిటీలను ఏర్పాటు చేసింది.. జిల్లా, శాఖాధిపతి, సచివాలయ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు పనిచేయనున్నాయి. జిల్లా కమిటీకి పాత జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించగా, కొత్త జిల్లాల కలెక్టర్లు కో-చైర్మన్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉద్యోగుల సీనియారిటీ, వ్యక్తిగత ప్రాధాన్యతలు, ప్రభుత్వ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని క్యాడర్ల కేటాయింపులు చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ప్రత్యేక వర్గాల ఉద్యోగులకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఉద్యోగులు, వితంతువులు, అలాగే క్యాన్సర్, గుండె శస్త్రచికిత్స, కిడ్నీ లేదా లివర్ మార్పిడి చేయించుకున్న ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనుంది. దీంతో ఆరోగ్య, సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మానవతా కోణంలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST)కు క్యాడర్లలో నిష్పత్తి ప్రకారం సమాన పంపిణీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. SC గ్రూప్-1కు 1 శాతం, గ్రూప్-2కు 6.5 శాతం, గ్రూప్-3కు 7.5 శాతం, STలకు 6 శాతం మేర కేటాయింపులు ఉండనున్నాయి.
తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు..
ఉద్యోగుల నుంచి తప్పుడు సమాచారం అందితే కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే ఒకసారి ఉద్యోగి తన ఆప్షన్ నమోదు చేసిన తర్వాత దాన్ని మార్చుకునే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న స్పౌస్ కేసుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగుల కేటాయింపులపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, కేటాయింపు ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఏడు రోజులలోపు సంబంధిత సచివాలయ కార్యదర్శికి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. కొత్త జోనల్ విధానం ద్వారా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ మరింత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతుందని పేర్కొంది ఏపీ ప్రభుత్వం..

