Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు

Single Teacher Schools

Single Teacher Schools

Single-Teacher Schools: ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ టీచర్లు మాత్రమే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. తక్కువ మంది ఉపాధ్యాయులతో పాఠశాలలు నడుస్తుండటంతో విద్యార్థులకు పూర్తి స్థాయిలో బోధన అందడం లేదని, దీనివల్ల వారి విద్యా నైపుణ్యాలు దెబ్బతింటున్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్‌లో భాగంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కనీసం ముగ్గురు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ తరహా సింగిల్ టీచర్ లేదా తక్కువ మంది ఉపాధ్యాయులతో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలు 16 వేలకుపైగా ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.

ఈ అంశాన్ని విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రాష్ట్రంలోని సింగిల్ టీచర్ పాఠశాలల పరిస్థితి, ఉపాధ్యాయుల ఖాళీలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. కాగా, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీ జరుగుతున్నా.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్న విషయం విదితమే.. ఈ పరిణామాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది..