Paraquat Herbicide Ban: పారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్ఎల్ (Paraquat Dichloride 24% SL) గడ్డి మందు అమ్మకాలను 60 రోజుల పాటు నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ ఈ ఏడాది మే 22న జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి. వెంకట నాగిరెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం, గడ్డి మందు సేవించి ఆత్మహత్యలు జరుగుతున్నాయనే అంశాన్ని ప్రస్తావిస్తూ డీజీపీ పంపిన లేఖ ఆధారంగా ప్రభుత్వం నిషేధం విధించిందని తెలిపారు. అయితే, ఈ నిర్ణయం తీసుకునే ముందు డీలర్లకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని, తమ అభ్యంతరాలు లేదా వివరణలు చెప్పుకునే అవకాశం కూడా కల్పించలేదని పిటిషనర్ వాదించారు.
కీటకనాశన చట్టంలోని నిబంధనల ప్రకారం, వ్యవసాయంలో వినియోగించే రసాయన పదార్థం వల్ల నేరుగా ప్రమాదం ఉన్నప్పుడే నిషేధం విధించవచ్చని, ఆత్మహత్యలను కారణంగా చూపి అమ్మకాలపై నిషేధం విధించడం చట్టబద్ధం కాదని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే, వ్యవసాయశాఖ ఆకస్మిక నిర్ణయం కారణంగా ప్రస్తుత సాగు సీజన్లో రైతులు కలుపు నివారణ సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని, భారీగా నిల్వలు ఉంచుకున్న డీలర్లకు కూడా ఆర్థిక నష్టం కలుగుతోందని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని, నిషేధ ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టనుండటంతో రైతులు, డీలర్లు, వ్యవసాయ రంగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

