AP High Court: గ్రూప్-1 అక్రమాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అడిషనల్ డీజీ స్థాయి అధికారిని అధిపతిగా నియమించి సిట్ను ఏర్పాటు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు నిష్పాక్షికంగా సాగేందుకు రాష్ట్రం వెలుపల ఉన్న ఫోరెన్సిక్ నిపుణుల సేవలను వినియోగించాలని కూడా ఆదేశించింది.
Read Also: Speaker Ayyannapatrudu: రేపటి నుంచి అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు.. స్పష్టం చేసిన స్పీకర్
ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా లేదా, వాటిలో ఎలాంటి మార్పులు (ట్యాంపరింగ్) జరిగాయా అన్న అంశాలను ఫోరెన్సిక్ నిపుణులతో సమగ్రంగా పరిశీలించాలని కోర్టు పేర్కొంది. అలాగే విజయవాడలో జరిగిన మూల్యాంకన సమయంలో ఉపయోగించిన బార్కోడ్లు, అసలు ఓఎంఆర్ షీట్లలోని వివరాలు పరస్పరం సరిపోలుతున్నాయా లేదా అన్న విషయాన్ని కూడా తనిఖీ చేయాలని ఆదేశించింది. దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న ఎంపికైన అభ్యర్థులను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిట్ తన దర్యాప్తు నివేదికను మార్చి 16లోగా సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది. అనుబంధ పిటిషన్లను పరిష్కరించిన హైకోర్టు, ప్రధాన వ్యాజ్యాలపై విచారణను మార్చి 16కి వాయిదా వేసింది.
