AP Collectors Conference: అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, శాంతిభద్రతలు సహా అనేక అంశాలపై ఫోకస్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి కలెక్టర్ల సదస్సుకు సిద్ధమయ్యారు.. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల పాటు 8వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన, శాంతిభద్రతలు తదితర అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా సమీక్షించనున్నారు. మొత్తం 19 కీలక అంశాలపై కలెక్టర్లతో సీఎం చర్చించి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు.
తొలిరోజు కీలక అంశాలపై సమీక్ష
సదస్సు తొలిరోజు గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, జిల్లా వారీ అభివృద్ధి లక్ష్యాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జీఎస్డీపీ వృద్ధి, స్వర్ణ ఆంధ్ర–2047 జిల్లా రోడ్మ్యాప్లు వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. రాష్ట్రాన్ని దీర్ఘకాలికంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు జిల్లాల వారీగా చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లకు సూచనలు ఇవ్వనున్నారు. సూపర్ సిక్స్ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై కూడా సమీక్ష ఉంటుంది. ఆరోగ్యం, విద్యాశాఖల పనితీరుతో పాటు జిల్లాల్లో ప్రజలకు అందుతున్న సేవలు, వాటి ఫలితాలపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరచడం, జిల్లాల ఆర్థికాభివృద్ధికి అవకాశాలను వినియోగించుకోవడంపైనా సమీక్ష జరగనుంది.
ఎల్నినో ప్రభావంపై ప్రత్యేక దృష్టి
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎల్నినో ప్రభావంపై కూడా ప్రత్యేకంగా చర్చించనున్నారు. ప్రజలకు తాగునీటి సరఫరా, జలధార కార్యక్రమం పురోగతిపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో వివిధ జిల్లాల కలెక్టర్లు చేపట్టిన ఉత్తమ ఆవిష్కరణలు, వినూత్న కార్యక్రమాలకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసి వాటి గురించి వివరించనున్నారు.
రెండో రోజ ఈ అంశాలపై ఫోకస్..
సదస్సు రెండో రోజు ఈ-గవర్నెన్స్, RTGS, PGRS పనితీరుపై సమీక్ష నిర్వహిస్తారు. భూ పరిపాలన, కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వినియోగం, వాటి అమలు తీరుపై చర్చిస్తారు. జిల్లాల స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కలెక్టర్లతో ఓపెన్ ఫోరం నిర్వహించనున్నారు. రెండో రోజు చివరగా రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష జరగనుంది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ముగింపు ప్రసంగం చేస్తారు. రెండు రోజుల సదస్సులో చర్చించిన అంశాల ఆధారంగా జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సేవల మెరుగుదలకు కలెక్టర్లకు కీలక మార్గదర్శకాలు ఇవ్వనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

