NTV Telugu Site icon

CM Chandrababu: ఏపీ ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ఆక్సిజన్ ఇచ్చింది..

Babu 2

Babu 2

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ఆక్సిజన్ ఇచ్చిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. బడ్జెట్, ఏపీ ప్రాజెక్టుల ప్రస్తావనపై అసెంబ్లీ సమావేశాల్లో స్పందించిన చంద్రబాబు. ఏపీ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ ఇచ్చిందన్నారు.. ఏపీ గురించి కేంద్రం బడ్జెట్టులో ప్రస్తావించారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు వచ్చేలా చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత మాదేనని కేంద్రం చెప్పిందని.. వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లా చేర్చారు.. సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు నాయుడు.

Read Also: Gold price drop: బడ్జెట్ ఎఫెక్ట్.. రూ. 4000 తగ్గిన బంగారం, వెండి ధరలు..

ఏపీలో పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పిందని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు.. బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రానికి ఈ సభ ద్వారా ధన్యవాదాలు చెబుతున్నాం అన్నారు. దేశం ఆర్థిక ప్రగతిలో నడిచేలా కేంద్ర బడ్జెట్ ఉందని ప్రశంసించారు. ఇక, త్వరలోనే ఏపీ బడ్జెట్ పెడతాం అన్నారు. సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. అన్నింటి మీద త్వరలో పెట్టబోయే బడ్జెట్టులో క్లారిటీ ఇస్తాం అని వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆలోచన మేరకు స్కిల్ సెన్సస్ చేపడుతున్నాం అన్నారు.. సుపరిపాలనకు మారు పేరుగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు నాయుడు..

Read Also: Cancer Drugs in Budget 2024: కాన్సర్ రోగులకు భారీ ఉపశమనం..నెలకు రూ.40వేల ఆదా..!

ఇక, కేంద్ర బడ్జెట్‌కు ఆంధ్రప్రదేశ్‌కి నిధుల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపిన విషయం విదితమే. ”మన రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.. ఇక, ”వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుండి వచ్చే సహకారం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుంది.. రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్‌ను సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నా.. ఏపీ మళ్లీ గాడిలో పడుతోంది” అంటూ ట్విట్టర్‌ (ఎక్స్‌)లో పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..

Read Also: Hyderabad: సూసైడ్ నోట్ రాసి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. కారణమిదే..?

కాగా, బడ్జెట్‌ 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిసింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతేకాదు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామని తెలిపారు. ఏపీ రాష్ట్రం, రైతులకు పోలవరం జీవనాడి అని పేర్కొన్నారు. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందని నిర్మలమ్మ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. విభజన చట్టం ప్రకారం.. పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామన్నారు. హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామని నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్న విషయం విదితమే.