AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. ఇక, రాజధాని అభివృద్ధికి సంబంధించి Andhra Pradesh Capital Region Development Authority (CRDA) సమర్పించిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా ఆర్-5 జోన్ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ప్రభుత్వ కాలంలో రాజధాని ప్రాంతమైన అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు R-5 జోన్ ఏర్పాటు చేశారు.
అయితే, ప్రస్తుతం CRDA అథారిటీ R-5 జోన్ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జోన్ కింద కేటాయించిన సుమారు 1,402.58 ఎకరాల భూమిని తిరిగి CRDAకి అప్పగించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే R-5 జోన్ కారణంగా అమరావతి మాస్టర్ ప్లాన్ అమలులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో CRDA ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూముల కేటాయింపుపై కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే State Investment Promotion Board (SIPB) సమర్పించిన పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అంశం కూడా అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది.
రాజకీయ పరిణామాలపై చర్చ?
ఇక, కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. అదే విధంగా తిరుమల లడ్డూ నాణ్యత, కల్తీ పాల అంశంపై కూడా ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. రేపటి కేబినెట్ సమావేశం రాజధాని అమరావతి భవిష్యత్తు దిశగా కీలక నిర్ణయాలకు వేదిక కానుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.