BC reservations: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు.. స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు ప్రకటన..

Chandrababu

Chandrababu

BC reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ రిజర్వేషన్లు, బీసీల రాజకీయ సాధికారత, స్థానిక సంస్థల్లో వారి భాగస్వామ్యంపై మాట్లాడారు. బీసీలకు అండగా ఉంటామని తమ ప్రభుత్వం మరోసారి నిరూపించిందని అన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రక నిర్ణయమని చంద్రబాబు పేర్కొన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పించడం కేవలం ఎన్నికల హామీ కాదని, అది తమ రాజకీయ సిద్ధాంతమని స్పష్టం చేశారు. హామీ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు దాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 34 శాతం రిజర్వేషన్లు బీసీలకు రాజకీయ అవకాశాలకు ద్వారం తెరుస్తాయని సీఎం అన్నారు. గ్రామ, మండల స్థాయి పాలనలో బీసీ మహిళలు, యువతకు అవకాశం కల్పించడం ద్వారా వెనుకబడిన వర్గాలకు మరింత అండ లభిస్తుందని చెప్పారు.

బీసీలకు రిజర్వేషన్లలో టీడీపీ పాత్ర
బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత ఎన్టీ రామారావుకు దక్కుతుందని చంద్రబాబు అన్నారు. అనంతరం బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 34 శాతానికి పెంచింది కూడా తెలుగుదేశం పార్టీనే అని పేర్కొన్నారు. బలమైన బీసీ నాయకులను టీడీపీ తయారు చేసిందని చెప్పారు. అయితే, గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో జీవోల పేరుతో నాటకాలు ఆడిందని చంద్రబాబు విమర్శించారు. తమ ప్రభుత్వం కేవలం రిజర్వేషన్లు కల్పించడం మాత్రమే కాకుండా బీసీలకు అండగా నిలుస్తోందని అన్నారు.

బీసీ మహిళలకు రాజకీయ అవకాశాలు కీలకం
బీసీ సాధికారతలో మహిళల పాత్ర కీలకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బీసీ మహిళలు, యువత గ్రామీణ, స్థానిక పాలనలో భాగస్వాములైతే వెనుకబడిన వర్గాలకు మరింత బలం చేకూరుతుందని అన్నారు. మహిళలకు చట్టబద్ధమైన హక్కులు కల్పించడంతో పాటు పాలనలో భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం బీసీలను గుర్తించి పాలనలో భాగస్వామ్యం చేస్తోందనే నమ్మకం ప్రజల్లో ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు.

బీసీ వర్గాలకు టీడీపీ చేసిన కార్యక్రమాల ప్రస్తావన
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో బీసీ వర్గాలకు ఆధునిక పనిముట్లను అందించి ఉపాధికి తోడ్పాటు అందించామని చంద్రబాబు తెలిపారు. రజకులకు ధోబీఘాట్లు, గీత కార్మికులకు, వడ్డెరలకు జీవనోపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. సంచార జాతులను కూడా టీడీపీ ప్రభుత్వం ఆదుకుందని వివరించారు.

ఎమ్మెల్సీ పదవులపై చంద్రబాబు ప్రకటన
అసెంబ్లీ వేదికగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై కూడా చంద్రబాబు ప్రకటన చేశారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన రమాదేవికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్లు తెలిపారు. అదే విధంగా వర్ల రామయ్యకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి చారిత్రక సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

28 జిల్లా పరిషత్‌లతో గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం
రాబోయే రోజుల్లో స్థిరమైన పాలన కోసం ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల నుంచి ఎన్నికల అనంతరం 28 జిల్లా పరిషత్‌లు ఉంటాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని మరింత వేగంగా చేపట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.