Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం వరకు రుతుపవనాలు విస్తరించినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నేడు అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు కోస్తా ఆంధ్రప్రదేశ్ అంతటా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు వడగాల్పులు కూడా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలు, రైతులు, మత్స్యకారులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది.

