Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..

Minister Narayana

Minister Narayana

Minister Narayana: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి పి.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిందని ఆయన అన్నారు. రాష్ట్రానికి మంచి రాజధాని నిర్మించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు సాగారని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలకు దీటుగా అమరావతిని నిర్మించాలన్నది చంద్రబాబు విజన్ అని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా కూడా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. అమరావతిని ప్రపంచంలోని టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు విజన్ అని మంత్రి నారాయణ తెలిపారు. రహదారులు, మౌలిక వసతులు, ఆధునిక నిర్మాణాలతో రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. అమరావతి అభివృద్ధిలో రైతులు, ప్రభుత్వం కలిసి ముందుకు సాగుతాయని మంత్రి పేర్కొన్నారు.

చంద్రబాబుపై నమ్మకంతో రైతుల భూములు
రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలైనా భూమి అవసరమని మంత్రి నారాయణ అన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని రైతులు తమ భూములను సమీకరణకు ఇచ్చారని తెలిపారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి లేకుండానే రైతులు రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. కృష్ణా నది ఒడ్డున అమరావతిని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమన్యాయం జరుగుతుందనే ఆలోచనతో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని మంత్రి వివరించారు.

సింగపూర్ మాస్టర్ ప్లాన్
చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో సింగపూర్ ప్రభుత్వం అమరావతికి మాస్టర్ ప్లాన్ అందించిందని నారాయణ పేర్కొన్నారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అప్పట్లో ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అయితే, 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల కాలంలో అమరావతి రాజధాని పనులన్నీ నిలిచిపోయాయని మంత్రి నారాయణ ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు రాజధానుల విధానాన్ని తీసుకురావడంతో అమరావతి అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల విధానం తీసుకొచ్చారని మంత్రి నారాయణ విమర్శించారు.

రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం
అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధిలో రైతుల పాత్ర కీలకమని పేర్కొన్నారు మంత్రి నారాయణ.. ఇదిలా ఉండగా, రాజధాని అమరావతిని అనుసంధానించే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉండవల్లి వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిల ప్రారంభానికి సూచికగా శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ, నాదెండ్ల మనోహర్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.