Araku Utsav 2026: ప్రకృతి అందాల నడుమ నిర్వహిస్తున్న అరకు ఉత్సవ్–2026 చివరి రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఐఏఎస్ అధికారులు స్వయంగా పాల్గొని అందరి మనసులు దోచుకున్నారు.
Read Also: Pinarayi Vijayan: కేంద్రానికి కేరళ సీఎం లేఖ.. వ్యాపారి సీజే.రాయ్ ఆత్మహత్యపై విచారణ జరపాలని డిమాండ్
ఫ్యాషన్ షోలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న ఈ జంట ఎవరో తెలుసా..?
వీరు మరెవరో కాదు.. భార్యాభర్తలైన అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్.. అరకు ఉత్సవ్ చివరి రోజున స్థానిక గిరిజన బాలికలతో కలిసి ప్రత్యేకంగా ఆదివాసీ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్, కలెక్టర్ విజయ్ కృష్ణన్ సంప్రదాయ గిరిజన వేషధారణలో ర్యాంప్పై నడిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు పాడేరు ఐటీడీఏ పీవో తిరువనిశ్రీ పూజ.. అల్లూరి అసిస్టెంట్ కలెక్టర్, టీడీపీ నాయకులు గిడ్డి ఈశ్వరి, దొన్నుదొర.. కూడా ఫ్యాషన్ షోలో పాల్గొని కార్యక్రమానికి మరింత వన్నె తీసుకొచ్చారు.
సాధారణంగా తీవ్రమైన పని ఒత్తిడిలో ఉండే ఐఏఎస్ అధికారులు ఇలా ఆడిపాడుతూ ప్రజలతో మమేకమవడం చూసి, కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. అధికారుల భాగస్వామ్యం వల్ల ఫ్యాషన్ షో మరింత ప్రత్యేకంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇలా ఆటవిడుపుగా, సాంస్కృతిక కార్యక్రమాల్లో అధికారులు పాల్గొంటే వారి పనితీరు మరింత ఉత్సాహంగా ఉంటుందని, ప్రజలతో అనుబంధం కూడా బలపడుతుందని స్థానికులు వ్యాఖ్యానించారు. మొత్తానికి అరకు ఉత్సవ్–2026లో ఈ ఫ్యాషన్ షో ఒక గుర్తుండిపోయే ఘట్టంగా నిలిచింది.
