Har Ghar Tiranga: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నడుస్తోంది. ఈ మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీంతో అందరూ తమ దేశభక్తిని చాటుకునేందుకు ఇళ్లపై జాతీయ జెండాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఓ వ్యక్తి తన ఇంటిపై జాతీయ జెండా కడుతూ విగతజీవిగా మారాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు వ్యక్తి తన ఇంటి మిద్దెపై జాతీయ జెండా కడుతుండగా కరెంట్ తీగలు తాకడంతో అక్కడికక్కడే అతడు కుప్పకూలిపోయాడు. కరెంట్ షాక్ తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియకపోయినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో ఇంటిపై జాతీయ జెండా కట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పలువురు హెచ్చరిస్తున్నారు. జాతీయ జెండాను ఏర్పాటు చేసే సమయంలో జాగ్రత్త వహించాలని లేదంటే ప్రమాదంలో పడే అవకాశం ఉందని సూచిస్తూ నెటిజన్లు ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నారు.
https://twitter.com/krishanKTRS/status/1558683770915811329
కాగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభాత భేరీలు, ప్రదర్శనలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కూడా తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్ను మార్చింది. కాషాయ జెండా స్థానంలో మూడు రంగుల జెండాను ఉంచింది.