Viral News: చెప్పులు జారిపోయాయి.. అయినా ఆమె పరుగు ఆగలేదు. కాళ్లకు చెప్పులు లేకుండా రాళ్లు, చల్లటి రోడ్డుపై పరుగెత్తిన 47 ఏళ్ల మహిళ చివరకు మారథాన్ విజేతగా నిలిచింది. ఆమె చేతికి వచ్చిన బహుమతి డబ్బు కేవలం రూ.3,000. కానీ ఆ మొత్తానికి ఆమె జీవితంలో ఉన్న విలువ అంతకంటే ఎంతో ఎక్కువ. ఆ డబ్బుతో తన ఇద్దరు కుమార్తెలకు పుస్తకాలు కొనాలని నిర్ణయించుకుంది. తన పిల్లల భవిష్యత్తు కోసం ఒక తల్లి చేసిన ఈ పరుగు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగైకి చెందిన రమాబాయి రణ్వీర్ వృత్తిరీత్యా వంట మనిషి. భర్త ముంబైలో జరిగిన ప్రమాదంలో మరణించడంతో ఇద్దరు కుమార్తెల బాధ్యతను ఆమె ఒక్కరే మోస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, పిల్లల చదువును మాత్రం ఆమె ఎప్పుడూ ఆపలేదు. అంబాజోగైలోని ఓ అకాడమీలో వంట పని చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నారు. అదే అకాడమీలో ఆమె పెద్ద కుమార్తె కూడా చదువుతోంది.
కుమార్తెలు తమ భవిష్యత్తు కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే, తల్లి వారి చదువుకు కావాల్సిన ఖర్చుల కోసం ప్రతిరోజూ శ్రమిస్తోంది. గతంలో కుటుంబానికి వ్యవసాయమే ప్రధాన ఆధారం. అయితే పిల్లల చదువు కొనసాగించేందుకు రమాబాయి వంట పనిని కూడా చేపట్టారు. పెద్ద కుమార్తె పూజా చదువుపై ఉన్న ఆసక్తిని గమనించిన అకాడమీ డైరెక్టర్ ఆమె ఫీజును కూడా మాఫీ చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థ నిర్వహించిన అమృత్ దౌడ్ మారథాన్ గురించి రమాబాయికి తెలిసింది. విజేతకు రూ.3,000 బహుమతి ఇవ్వనున్నారని తెలియడంతో ఆమె కూడా పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. మారథాన్కు వచ్చిన వారిలో చాలామంది యువతీ యువకులు ట్రాక్సూట్లు ధరించి సిద్ధంగా ఉండగా, రమాబాయి మాత్రం సాధారణ చీరలోనే అక్కడికి వచ్చారు.
పరుగు ప్రారంభించినప్పుడు ఆమె కాళ్లకు చెప్పులు ఉన్నాయి. అయితే పరుగులో అవి పదేపదే జారిపోవడంతో వాటిని చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత చెప్పులు లేకుండానే పరుగును కొనసాగించారు. చల్లటి రోడ్డు, దారిలోని రాళ్లు, చీరను జాగ్రత్తగా పట్టుకోవాల్సిన పరిస్థితి.. ఏదీ ఆమె వేగాన్ని ఆపలేకపోయింది. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఇతర రన్నర్లను దాటుకుంటూ చివరకు మొదటి స్థానంలో నిలిచారు.
మారథాన్లో రమాబాయి గెలవడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రేక్షకులు చప్పట్లతో ఆమెను అభినందించారు. అయితే రమాబాయి దృష్టిలో ఆ విజయం కేవలం పతకం లేదా ప్రశంసల కోసం కాదు. తన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు గురించే పరుగులో ఉన్నంతసేపూ ఆలోచించానని ఆమె తెలిపారు. లభించిన రూ.3,000తో కుమార్తెలకు పుస్తకాలు కొనుగోలు చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని ఇండియా టుడే నివేదించింది.
ఈ పోటీలో రమాబాయి పెద్ద కుమార్తె పూజా కూడా పాల్గొన్నారు. ఆమె రెండో స్థానంలో నిలిచారు. తల్లిని మారథాన్లో పాల్గొనమని ప్రోత్సహించింది పూజానే. అయితే తన తల్లి మొదటి స్థానంలో నిలుస్తారని మాత్రం ఆమె ఊహించలేదు. ప్రస్తుతం పూజా పోలీస్ రిక్రూట్మెంట్ కోసం సిద్ధమవుతున్నారు. భవిష్యత్తులో పోలీస్ అధికారిగా మారాలనేది ఆమె కల. ఆమె సోదరి బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
తన తల్లి కష్టాలను దగ్గరగా చూసిన పూజా, ఇద్దరు కుమార్తెలను పెంచుతూ వారి చదువు కోసం రమాబాయి ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని చెప్పారు. కుటుంబ పరిస్థితులు ఎన్ని సవాళ్లు విసిరినా, పిల్లల భవిష్యత్తుపై ఆమె ఆశను మాత్రం వదులుకోలేదు.
అందుకే రమాబాయి మారథాన్లో వేసిన ప్రతి అడుగు వెనుక ఒక లక్ష్యం ఉంది. చెప్పులు జారిపోయినప్పుడు వాటిని చేతిలో పట్టుకున్నారు. కాళ్లకు గాయాలైనా పరుగును ఆపలేదు. ఎందుకంటే ఆమెకు అది ఒక సాధారణ పరుగు కాదు. తన కుమార్తెల కలలకు చేరువ కావడానికి చేసిన మరో ప్రయత్నం. బహుమతిగా వచ్చిన రూ.3,000 చిన్న మొత్తమే కావచ్చు. కానీ ఒక తల్లి తన పిల్లల చదువుకోసం దానిని గెలుచుకున్న విధానం మాత్రం ఎంతో పెద్ద కథగా నిలిచిపోయింది.

