రాజస్థాన్ అంటేనే కోటలు, రాజప్రాసాదాలు, అద్భుతమైన కట్టడాలకు నిలయం. అయితే.. అందరికీ తెలిసిన ప్రముఖ పర్యాటక ప్రాంతాలే కాకుండా, రాజస్థాన్లో ఇంకా వెలుగులోకి రాని కొన్ని అద్భుతాలు దాగి ఉన్నాయి. అటువంటి వాటిలో ముఖ్యమైనది అభనేరి గ్రామంలోని ‘చాంద్ బావోరీ’ అనే మెట్ల బావి. ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ కట్టడం గురించి వివరిస్తూ.. ఇది కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, రాతిలో చెక్కిన ఒక గొప్ప ఆలోచన అని ప్రశంసించారు. నేటి కాలంలో మనం మాట్లాడుకునే ‘డిజైన్ థింకింగ్’. ఇది 1000 ఏళ్ల క్రితమే నిదర్శనంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
చాంద్ బావోరీ విశేషాలు..
దీనిని 8వ – 9వ శతాబ్దంలో నికుంభ వంశానికి చెందిన చాందా రాజు నిర్మించారు. ఇది సుమారు 30 మీటర్ల లోతు ఉంటుంది. దీనిలో 13 అంతస్తులు, సుమారు 3,500 మెట్లు అత్యంత కచ్చితమైన ఆకృతిలో అమర్చబడి ఉంటాయి. ఈ మెట్ల అమరిక ఎంత అద్భుతంగా ఉంటుందంటే.. పైనుంచి చూస్తే అది ఒక తలకిందులుగా ఉన్న పిరమిడ్ లా కనిపిస్తూ చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది.
రాజస్థాన్లో నీటి ఎద్దడి ఎక్కువ. వర్షపు నీటిని నిల్వ చేయడానికి .. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఈ బావిని నిర్మించారు. బావి అడుగు భాగంలో ఉష్ణోగ్రత బయటి కంటే 5-6 డిగ్రీలు తక్కువగా ఉంటుంది.
సినిమా లోకంలో చాంద్ బావోరీ..
ఈ కట్టడం కేవలం చరిత్రకారులనే కాకుండా సినీ దర్శకులను కూడా ఆకర్షించింది. షారుఖ్ ఖాన్ నటించిన ‘పహేలీ’, విద్యాబాలన్ సినిమా ‘భూల్ భూలయ్యా’ వంటి చిత్రాల్లో ఈ బావి కనిపిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన ‘ద డార్క్ నైట్ రైజెస్’, ‘ద ఫాల్’ వంటి సినిమాల్లో కూడా చాంద్ బావోరీని మనం చూడవచ్చు.
ఎలా వెళ్లాలి..?
చాంద్ బావోరీ జైపూర్ నగరం నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జైపూర్ విమానాశ్రయం దీనికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం. ఈ బావి పక్కనే ‘హర్షత్ మాత’ ఆలయం కూడా ఉంది. పూర్వం భక్తులు మొదట ఈ బావిలో కాళ్లు, చేతులు కడుక్కుని ఆ తర్వాతే అమ్మవారి దర్శనానికి వెళ్లేవారు.
