NTV Telugu Site icon

‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుకుమార్ ఎందుకు రాలేదు? కారణం ఇదే..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప ది రైజ్’ మూవీ మరో ఐదు రోజుల్లో థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే ఈ సినిమా దర్శకుడు సుకుమార్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు, ముఖ్య అతిథులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాన్ ఇండియా లెవల్లో తీసిన ఈ సినిమా ఈవెంట్‌కు దర్శకుడు హాజరుకాకపోవడంతో ఏదైనా పెద్ద కారణం ఉందా అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుకుమార్ హాజరుకాకపోవడానికి గల కారణాలను ఆయన శిష్యుడు, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించాడు. పుష్ప మూవీ పాన్ ఇండియా సినిమా కాబట్టి దర్శకుడు సుకుమార్ ముంబైలో మిక్సింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని.. అందుకే ఆయన హాజరుకాలేకపోయినట్లు వివరించాడు. సుకుమార్‌ను ఎన్నో ఏళ్లుగా తాను చూస్తున్నానని… ఆయన కష్టం అప్పటికీ, ఇప్పటికీ ఏం మారలేదని బుచ్చిబాబు తెలిపాడు. కొద్దిగా సర్దుబాటు చేసుకుని అయినా ఈ కార్యక్రమానికి రావాలని తాను చెప్పానని.. కానీ ఈ సినిమా ప్రీమియర్లను మరో మూడురోజుల్లో యూఎస్‌ఏలో ప్రదర్శించాల్సి ఉందని.. అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేయాలంటే క్వాలిటీలో రాజీపడకూడదని.. అందుకే తాను దగ్గరుండి ఆ కార్యక్రమాలు చూసుకోవాలని సుకుమార్ తనకు చెప్పినట్లు బుచ్చిబాబు వెల్లడించాడు.

సినిమా తీసినోడు పోతాడు.. సినిమా చూసినోడు పోతాడు.. కానీ సినిమా ఒక్కటే శాశ్వతంగా ఉంటుందని.. ఆ సినిమా బాగా రావాలని తన ఆకాంక్ష అని సుకుమార్ చెప్పినట్లు తెలిపాడు. ఇక ఈ మూవీలో బన్నీ యాక్టింగ్ సూపర్‌గా ఉంటుందని.. తాను ఐదారు సార్లు ఈ మూవీ రషెస్ చూశానని పేర్కొన్నాడు. ఈ సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ చూసిన వారిపై వారం, పదిరోజుల పాటు ఆ పాత్ర ఇంపాక్ట్ ఉండిపోతుందన్నాడు. ఈ మూవీలో హీరోయిన్ రష్మిక చాలా అందంగా ఉందని.. స్వామి.. నా స్వామి పాటలో ఆమె యాటీట్యూడ్ అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక మైత్రీ మూవీస్ బ్యానర్ విషయానికి వస్తే ఒకేసారి 10 సినిమాలను నిర్మిస్తున్నారని.. ఈ బ్యానర్ నిర్మాతలకు సినిమా అంటే ఎంత ఇష్టమో దీన్ని బట్టి చెప్పవచ్చని బుచ్చిబాబు అభిప్రాయపడ్డాడు.