ప్రపంచం చూపు మొత్తం ఇప్పుడు షంజ్ షీర్ పైనే ఉంది. అప్ఘన్ తాజా మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తాలిబన్లతో పోరాడాలేక దేశం విడిపోడి పారిపోయిన సంగతి తెల్సిందే. ఈక్రమంలోనే అప్ఘన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకొని తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాలిబన్ల పాలనను ఒప్పుకునేది లేదంటూ అక్కడి ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు వస్తున్నాయి. ముఖ్యంగా సింహాలగడ్డగా పేరొందిన షంజ్ షీర్ ప్రాంతవాసులు తాలిబన్లతో గట్టిగా పోరాడుతున్నారు.
ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్, పంజ్షీర్ నాయకుడు మసూద్ నేతృతృంతో కొద్దిరోజులుగా తాలిబన్లపై పోరాటం కొనసాగుతోంది. ఈక్రమంలోనే పంజ్షీర్ ను తాము హస్తగతం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించడం కలకలం రేపింది. ‘అల్లా దయతో ఆఫ్గన్ మొత్తం మా ఆధీనంలోకి వచ్చింది.. పంజ్షీర్లో తిరుగుబాటుదారులను ఓడించాం.. ప్రస్తుతం ఆ ప్రావిన్స్ మా కమాండ్లోనే ఉంది.’ అంటూ తాలిబన్ కమాండర్ ఒకరు వెల్లడించారు.
తాలిబన్ల ప్రకటనను ఆఫ్గనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ పూర్తిగా ఖండించారు. ‘మేమిప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం.. తాలిబన్లపై దండయాత్ర కొనసాగుతోంది.. మేము ఈ నేలను పట్టుకుని పోరాడుతున్నాం..’ పేర్కొన్నారు. తాలిబన్లపై తమ పోరాటాన్ని ఆపేది లేదని.. నేనిప్పుడు నా దేశం కోసం నిలబడుతున్నాను.. దేశ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను’ అంటూ బీబీసీ న్యూస్కు ఆయన ఓ వీడియో సందేశం పంపించారు.
అప్ఘన్ ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకే తాలిబన్లు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అమృల్లా సలేహ్ తనయుడు ఎబదుల్లా సలేహ్ ఒక ప్రకటనలో తెలిపారు. తాలిబన్లు పంజ్షీర్ను జయింలేదని స్పష్టం చేశారు. షంజ్ షీర్ ను జయించామని తాలిబన్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆఫ్గనిస్తాన్ జాతీయ తిరుగుబాటు దళం-విదేశీ వ్యవహారాల చీఫ్ అలీ నజరీ సైతం దీనిని ఖండించారు.
తాలిబన్లతో పంజ్షీర్లోని 10వేల మంది యోధులు తీవ్రంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే తాలిబన్లు ఇలాంటి కుటిల పన్నాగాలు పన్నుతున్నారన్నారు. ఇలాంటి చర్యల ద్వారా ఆఫ్గన్ ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని తాలిబన్లు భావిస్తున్నారని తెలిపారు. పంజ్షీర్లోని తిరుగుబాటు దళ నాయకులతో తాను టచ్లో ఉన్నానని తెలిపారు. తాలిబన్లు చేస్తున్న ప్రకటనలో నిజం లేదని తేల్చిచెప్పారు.
పంజ్షీర్ నాయకుడు మసూద్.. ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఇద్దరూ దేశం విడిచి పారిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయని.. ఇందులో ఏమాత్రం నిజం లేదని అమృల్లా సలేహ్ స్పష్టం చేశారు. తాము ఇప్పటికీ కూడా పంజ్షీర్ గడ్డ పైనే ఉన్నామని స్పష్టం చేశారు. పంజ్షీర్ ప్రస్తుతం మసూద్ నాయకత్వంలో తాలిబన్లతో పోరాడుతుందని తెలిపారు. తమ వెంట సుశిక్షితులైన 10వేల మంది పంజ్షీర్ యోధులు ఉన్నారని వీరంతా తాలిబన్లతో పోరాడుతున్నారని తెలిపారు.
ఇప్పటికే షంజ్ షీర్ యోధులు వందలాది మంది తాలిబన్లను హతం చేశారనే వార్తలు వస్తున్నాయి. అయితే తాలిబన్లు మాత్రం పంజ్షీర్పై తాము పైచేయి సాధించినట్లు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో అక్కడి పరిస్థితిపై గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే పంజ్షీర్లో తాలిబన్లకు అల్ ఖైదా సాయం చేస్తుందని వీరువురిని తాలిబన్ తిరుగుబాటు దళం ఒంటరిగానే ఎదుర్కొంటోందని ఆఫ్ఘన్ అధికారి ఒకరు చెప్పారు.
ప్రపంచం తమను పట్టించుకోవడం లేదని ఉగ్రవాదంపై పోరులో తమకు బయటికి నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవడం విచారకరమని పంజ్ షీర్ నేతలు వాపోతున్నారు. అప్ఘన్లో మెజార్టీ ప్రజలు తాలిబన్ల పాలనను అంగీకరించడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు స్పందించి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు తాలిబన్లు అప్ఘన్లో పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.
