కేసీఆర్‌కు మేము భయపడేటోళ్లం కాదు : కిషన్‌రెడ్డి

తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై టీఆర్‌ఎస్‌, బీపేజీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వడం లేదంటూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు అంటుంటే.. ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొంటుందని బీజేపీ నేతలు హామీలు ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేము టీఆర్‌ఎస్‌కో, కేసీఆర్‌కో భయపడేవాళ్ల కాదని.. ఒకవేళ భయపడితే రైతులకు భయపడుతామని ఆయన అన్నారు.

అంతేకాకుండా మెడ మీద కత్తిపెట్టి సంతకం చేయించుకున్నారని కేసీఆర్‌ అనడం దురదృష్టకరమని, ధాన్యం కొనుగోలుపై టీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు. బాయిల్డ్‌ రైస్‌పై అగ్రిమెంట్ చేసుకుంది తెలంగాణ ప్రభుత్వమేనని ఆరోపించారు. హుజురాబాద్‌లో ఓటమి కేసీఆర్‌ జీర్ణించుకోలేక ధాన్యం కొనుగోళ్లపై గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.