తెలంగాణలో బస్సు ఛార్జీల మోత మోగనుందా? సామాన్యులపై నిత్యావసరాలకు తోడు బస్సు ఛార్జీలు కూడా భారం కానున్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై త్వరలో నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారులతో సమావేశం అయింది. ఖైరతాబాద్ రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై సమావేశం అయింది.
సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆఫీస్ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొని వివిధ అంశాలను పరిశీలిస్తున్నారు. పల్లెవెలుగు బస్సులకు కిలోమీటర్ కు 25 పైసలు. ఎక్స్ ప్రెస్ ఆపై సర్వీసులకు 30 పైసలు పెంచాలని యోచిస్తున్నారు. సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు, మెట్రో డీలక్స్ సర్వీసులకు 30 పైసలు పెంచాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తరువాత అధికారికంగా ప్రకటించనుంది ఆర్టీసీ యాజమాన్యం. దీంతో ఈ నెల నుంచి ఛార్జీల భారం మోయాల్సిందే.