తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలిపులి పంజా విసిరింది. తిర్యాని మండలం గిన్నెదరిలో 8.3 గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిర్పూర్ (యూ) లో 9 డిగ్రీలు నమోదయింది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల చలి బాగా పెరిగింది. నగరం చలి గుప్పిట్లో చిక్కుకుంది. జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మూడు రోజులుగా పెరుగుతున్న చలి నగరవాసులన్ని వణికిస్తుంది. మూడు రోజుల క్రితం 19 డిగ్రీల సెల్సియస్గా ఉన్న కనిష్ట ఉష్ణోగ్రత12 డిగ్రీలకు చేరుకుంది. మరో నాలుగైదు రోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 6.5 డిగ్రీలు, జహీరాబాద్ సత్వార్ లో 7.3 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 7.1 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 7.4, రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడెం కాసులాబాద్లో 8.2 డిగ్రీలు నమోదైంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడి దల నల్లవల్లిలో 8.2 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో హెచ్ సీయూ దగ్గర 8.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్, కొమురం భీం, సంగారెడ్డి జిల్లాల్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.