NTV Telugu Site icon

కేఆర్‌ఎంబీకి తెలంగాణ సర్కార్‌ మరోలేఖ.. సాగర్‌లో ఆ తేడా ఎందుకు..?

జల జగడం విషయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య వార్‌ నడుస్తూనే ఉంది… ఇప్పుడు, విమర్శలు, ఆరోపణల పర్వం కాస్త ఆగినట్టే కనిపిస్తున్నా.. లేఖలు, ఫిర్యాదుల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది.. ఇవాళ కే‌ఆర్‌ఎం‌బీ చైర్మన్‌కు తెలంగాణ ఈ‌ఎన్‌సీ లేఖ రాసింది. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాల్వల ప్రవాహ సామర్థ్యాల్లో తేడాను సవరించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. 1952లో ఆంధ్ర, హైదరబాద్ రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం నాగార్జునసాగర్ కుడి కాలువ (ఏపీ వైపు), ఎడమ కాలువ(తెలంగాణ వైపు) హెడ్ రెగ్యులేటర్ల విడుదల సామర్థ్యాలు సమానంగా ఉండాలని కోరింది.

నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ విడుదల సామర్థ్యం నాగార్జునసాగర్ నీటి మట్టం +500 అడుగుల వద్ద 11,000 క్యూసెక్కులు ఉంటే, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ విడుదల సామర్థ్యం నాగార్జునసాగర్ లో నీటి మట్టం +520 అడుగుల ఉంటేనే 11,000 క్యూసెక్కులు వీలవుతుందని కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది.. MDDL 510 అడుగుల వద్ద ఎడమ కాలువ విడుదల సామర్థ్యం 7,899 క్యూసెక్కులు ఉండగా కుడి కాలువ విడుదల సామర్థ్యం 24,606 క్యూసెక్కులు ఉందని.. ఇది రెండు కాలువల్లో ఉన్న తీవ్రమైన అసమానతగా పేర్కొంది తెలంగాణ ఇరిగేషన్‌ ఈఎన్‌సీ.. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల హెడ్ రెగ్యులేటర్ల విడుదల సామర్థ్యాల్లో ఉన్న ఈ అసమానతను సరిదిద్దాలని.. రెండు కాలువల విడుదల సామర్థ్యం సమానంగా ఉండాలని కోరింది.