తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.. న్యూ ఇయర్ నేపథ్యంలో ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు.. కోవిడ్, నియంత్రణలో భాగంగా ర్యాలీలు, సభలు జనవరి 2వ తేదీ వరకు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్న ఆయన.. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ఈ ఆదేశాలు అమలు చేయాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఇక, వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని సూచించారు. కోవిడ్ నిబంధనల్లో ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనలు అమలు చేస్తామని తెలిపారు డీజీపీ మహేందర్రెడ్డి.
కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండడం.. ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతోన్న నేపథ్యంలో అప్రమత్తమైంది ప్రభుత్వం.. ఎయిర్ పోర్ట్లో కూడా టెస్టులు చేసి, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని తెలిపారు డీజీపీ మహేందర్రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశాం.. ఎక్కడైనా ఇంకా మిగిలిపోయి ఉంటే వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తున్నాం అన్నారు.. విధుల్లో ఉన్న పోలీసులు మాస్క్ లు ధరించి డ్యూటీ చేయాలని స్పష్టం చేశారు. ఇక, పబ్బులు, ఈవెంట్స్ పై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొన్నారు తెలంగాణ పోలీస్ బాస్ మహేందర్రెడ్డి.