కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ మరో మైలురాయిని చేరుకుంది. రాష్ట్రంలో గురువారం ఉదయం వరకు 4 కోట్ల టీకా డోసుల పంపిణీ పూర్తయింది. ఈ ఏడాది జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. ఈ ప్రక్రియ మొదలుపెట్టిన 165 రోజుల్లో కోటి డోసులు, 233 రోజుల్లోనే రెండు కోట్ల డోసులను, 260 రోజుల్లోనే మూడు కోట్ల డోసులను అధికారులు పూర్తి చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర జనాభాలో 18 ఏళ్లు నిండిన 94% మందికి ఫస్ట్ డోస్, 50% మందికి సెకండ్ డోస్ అందిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు.
సీఎం కేసీఆర్ సహకారం, కరోనా నిబంధనల వల్లే తెలంగాణలో నాలుగు కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ సాధ్యమైందని సోమేష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు వైద్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. మిగతా కోటి డోసుల పంపిణీని మరో నెలలో పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. అర్హులైన 18 లక్షల మంది ఇంకా కరోనా వ్యాక్సిన్లు తీసుకోలేదని సమాచారం.
