తెలంగాణలో బీజేపీ 2023 ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. టీఆర్ఎస్ కి ధీటుగా పోటీ ఇచ్చేందుకు స్కెచ్ రెడీ చేస్తోంది. బీజేపీ ఎస్సీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఎస్సీ నియోజకవర్గాల్లో గెలుపే కీలకం అంటున్నారు. ఎస్పీ నియోజకవర్గాల్లోని ఇతర కులాలను పార్టీ వైపు మళ్లించాలన్నారు.
అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు వ్యవహారం జాతీయ నాయకత్వం చూస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు సర్వే నిర్వహిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ ఓటు శాతం క్రమేణ పెరుగుతోంది. ప్రతి ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో కమిటీ ఒకరోజు పూర్తిగా పర్యటించాలన్నారు.
అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 న ఎస్సీ నియోజకవర్గాల్లో ‘బహుజన పాదయాత్ర’ పేరిట కనీసం 2 నెలలపాటు పాదయాత్ర చేసేలా కార్యక్రమాన్ని రూపొందించాలని బండి సంజయ్ యోచిస్తున్నారు. ఆయా నియోజకవర్గాలలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వివరాలను గ్రామాల వారీగా సేకరించి ప్రచారం చేయాలని భావిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ ఖాళీల భర్తీ, దళిత బంధు పథకాలతోపాటు స్థానిక ఎమ్మెల్యే, స్థానిక టీఆర్ఎస్ నేతల అక్రమాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేలా ఈ సమన్వయ కమిటీ పనిచేయాలన్నారు.
