NTV Telugu Site icon

తెలకపల్లి రవి : విశాఖ నుంచి పాలనకు కేంద్రం ఆశీస్సులు… హైకోర్టు మార్పు ఆలస్యం

cm jagan

ఇటీవల ఎపి ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు ఢల్లీిలో పర్యటించి కేంద్ర పెద్దలను కలసి వచ్చాక పాలనావికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల హడావుడి బాగా పెరిగింది. హోంమంత్రిఅమిత్‌షాను కలుసుకున్నప్పుడు ఇచ్చిన మెమోరాండంలో మొదటి అంశమే పాలనావికేంద్రీకరణ కావడం యాదృచ్చికం కాదు..దీనిపై ఢల్లీిపెద్దలు ఏ రూపంలోనూ ఎలాటి అభ్యంతరంగాని భిన్నాభిప్రాయం గాని వెలిబుచ్చలేదు సరికదా ముందుకు పొమ్మని పచ్చజెండా వూపినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసుతో మొదలు పెట్టి వివిధ విభాగాలకు కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. స్థానిక అధికారులు స్థలాలను కూడా సేకరించి పెట్టారు. గతంలోనిర్దిష్టంగా కేసు వేసిన గెస్ట్‌హౌస్‌ నిర్మాణం వంటివి మినహాయిస్తే మిగిలిన వాటికి కోర్టుల నుంచి ఏ అభ్యంతరం వుండదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సేకరించిన స్తలాలలోనూ 110 ఎకరాలు తప్ప మిగిలినవాటికి లీగల్‌ చిక్కులేమీ లేవని చెబుతున్నారు.

అమరావతిలో సిఆర్‌డిఎ యథాతథస్థితిని కదిలించరాదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల రీత్యా వాటిని అలాగే వుంచి సమాంతరంగా విశాఖలో కార్యాలయాలను నెలకొల్పడం అన్నది వ్యూహంగా అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పాలిస్తే అదే రాజధాని అని నిర్వచనాలుచెబుతున్నారు. ఇంత వేగంగా ఈ పరిణామాలు జరిగిపోవడానికి కారణం కేంద్రం నుంచి ఆశీస్సులు లభించడమేనని ఇప్పుడు అధికారికంగా తెలుస్తున్నది. రాష్ట్రంలో బిజెపి నేతలేమో అమరావతి దీక్షలకు మద్దతు చెబుతున్నారు. అమరావతి జెఎసికి కూడా సంఘపరివార్‌ వ్యక్తినే గౌరవాద్యక్షుడుగా పెట్టుకున్నారు.జగన్‌ ఢల్లీి పర్యటన తర్వాత కూడా బిజెపి తీరులో మార్పులేదు.రాజ్యాంగ రీత్యా రాజధాని రాష్ట్ర పరిధిలోది గనక కేంద్రం ఏమీ మాట్లాడటం లేదనిరాజకీయంగా తాము మాత్రంవ్యతిరేకమేనని బిజెపి రాష్ట్ర నేతలు అంటున్నా ఆ మాటల్లో బలం లేదు. ఎపి సమస్యలవిషయంలోనూ రాజధాని రాజకీయంలోనూ బిజెపి ద్వంద్వనీతికిది దర్పణంపడుతుంది.

తెలుగుదేశం పార్టీ కోర్టులు ఇందుకు అడ్డుపడతాయని ఆశిస్తున్నదే గాని స్థానికంగా ఆశించిన మద్దతు పొందలేకపోయింది. పంచాయితీ ఎన్నికలలో అమరావతి ప్రాంతంలో వైసీపీ గెలవడం తమ వైఖరికి మద్దతుగా ప్రభుత్వం చెప్పుకుంటున్నది.కోర్టుల వరకూ వస్తే అమరావతిలో యథాతథస్థితిని సాంకేతికంగా కొనసాగించినంతవరకూ ఇబ్బంది వుండదనేది ప్రభుత్వ వ్యూహంగా వుంది. పైగా హైకోర్టు మొత్తం కేసును పూర్తిగా విచారణ పున:ప్రారంబించాలని నిర్ణయించింది గనక ఇప్పట్లో తేలదని కూడా చెబుతున్నారు. శాసనరాజదాని అమరావతిలోనే వున్నంత వరకూ దాని ప్రతిపత్తికి భంగం లేదని ఎవరూ అభ్యంతరం పెట్టనవసరం లేదని మంత్రులు వాదిస్తున్నారు.

హైదరాబాదులో పదేళ్లు ఉమ్మడిరాజధానికి అవకాశం వున్నా చంద్రబాబు నాయుడు హఠాత్తుగా వచ్చేసి ఆ హక్కు వదులుకున్నారు తప్ప కొత్త రాజధానికి ఒక రూపం తేలేదు.జగన్‌ అధికారంచేపట్టాక అక్కడ సచివాలయభవనాలు కూడా అప్పగించారు గాని అమరావతిలో అసంపూర్ణ నిర్మాణాలు పూర్తి చేయలేదు. తమ వికేంద్రీకరణచట్టంతో తలెత్తిన న్యాయప్రతిష్టంభన తొలగకుండానే విశాఖకు పాలనారాజధాని తరలించేస్తామని హడావుడి చేస్తున్నారు.రాష్ట్రంలో పెద్ద నగరాలు లేవనిపదేపదే అంటున్న జగన్‌తన విధానంతో మూడు నగరాలలోనూ అనిశ్చితి తాండవించడం సమాజ ఆర్థికకార్యకలాపాలను ప్రజల జీవితాలనుకూడా దెబ్బతీయడం గుర్తించాల్సివుంది. కరోనాతాకిడిలో ఏపికి ఇది ప్రత్యేకమైన సంకటంగా మారింది.

మూడు రాజధానులు అంటున్న ప్రభుత్వం న్యాయరాజధానిగా కర్నూలును ప్రకటించింది.తమాషా ఏమంటే బిజెపి ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చిన, అన్ని రాజకీయ పక్షాలూ ఆమోదించిన విషయం కర్నూలుకు హైకోర్టు తరలింపు. అందుకోసం రీనోటిఫికేషన్‌ ఇవ్వాలని జగన్‌ కోరినదానిపైనా కేంద్రం స్పందన లేదు. మామూలు ప్రకారం హైకోర్టుతో సంప్రదించి సుప్రీం కోర్టు ద్వారా చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధం కావడం లేదు.విభజన సమస్యల పరిష్కారం వంటి సమస్యలు ఈ మధ్యనే భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌విరమణ హైకోర్టుల స్థితిగతులపై జరిపిన వర్చ్యువల్‌ సమావేశంలో ఎపిహైకోర్టు సిజె అరూప్‌గోస్వామి అమరావతిలో మౌలిక సదుపాయాలు లేవని ఫిర్యాదు చేశారు. కనీస వసతులు లేకుండా న్యాయ ప్రక్రియ సజావుగా జరగడం కష్టమని సిజెఐ వ్యాఖ్యానించారు. కాని త్రిశంకు స్వర్గంలా వున ఎపి హైకోర్టుకు ఇక్కడ వసతులు పెంచడం గాని కర్నూలుకు తరలించే చర్యలు గాని ఏవీ జరగకపోవడం వాస్తవం.లాంచనంగా అమిత్‌షాను కోరినప్పటికీ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి హయాంలో హైకోర్టు తరలింపు జరిగేపని కాదని జగన్‌ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని అనధికార సమాచారం.కనుక దాన్ని పక్కన పెట్టినట్టే భావించాలి.