NTV Telugu Site icon

పీఆర్సీపై కొనసాగుతోన్న ఉత్కంఠ..!

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది… అసలు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మనసులో ఏముంది? ఫిట్‌మెంట్‌ 30 శాతం మార్క్‌ అయినా దాటుతుందా…? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఉద్యోగ వర్గాలు.. ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి.. అయితే, 11వ వేతన సంఘం ఇప్పటికే 23 శాతం సిఫార్సు చేసింది.. ఇక, కేంద్రం ఇస్తున్నట్లు 14 శాతం సిఫార్సు చేసింది సీఎస్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ.. కానీ, కనీసం 30 శాతం ఫిట్‌మెంట్‌ అయినా వస్తుందని ఆశలు పెట్టుకున్నాయి ఉద్యోగ సంఘాలు..

Read Also: అగ్రరాజ్యానికి ఒమిక్రాన్‌ టెన్షన్‌.. 30 రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు..!

ఇక, నివేదికలపై పలు రకాలుగా అంచనాలు వేస్తున్నారు.. ఫిట్‌మెంట్‌ విషయంలో కేంద్రాన్ని, ఇంటి అద్దె విషయంలో తెలంగాణను ఫాలో అయ్యారా? అని ప్రశ్నిస్తున్నారు.. కాగా, పీఆర్సీ అమలు సమయంలో ఇంటి అద్దె అలవెన్స్‌ను గణనీయంగా తగ్గించింది తెలంగాణ సర్కార్‌.. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏను 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించింది.. రెండు లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో 17శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. కానీ, అమరావతి ప్రాంతంలో 30 శాతం అద్దె అలవెన్స్‌ పొందుతున్నారు ఉద్యోగులు.. ఇప్పుడు అత్యధికంగా 24 శాతానికి పరిమితం అయ్యాయి సీఎస్‌ కమిటీ రికమెండేషన్లు.. దీంతో.. ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏను కోతపెట్టే అవకాశం ఉందనే ప్రచారం ఉద్యోగులను మరింత టెన్షన్‌ పెడుతోంది. కాగా, ఇప్పటికే ఏపీ సీఎస్ ఆధ్వర్యంలో పీఆర్సీ, ఫిట్ మెంట్ పై కార్యదర్శుల కమిటీ రూపొందించిన నివేదికను సీఎం జగన్‌కు సమర్పించారు. పీఆర్సీ కమిటీ నివేదికలోని 11 సిఫార్సులను ఆమోదిస్తున్నట్లు సీఎస్ శర్మ తెలిపారు. ఐదు సిఫార్సులను తగు మార్పులు చేసి ఆమోదించాలని సూచించినట్లు తెలిపారు. రెండు సిఫార్సులను అమలు చేయాల్సిన అవసరం లేదని తాము సిఫార్స్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత మేర ఫిట్‌మెంట్ ఇస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందనే విషయమై ఏడు అంశాలను నివేదికలో పొందుపరిచారు.