దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. ఇటీవల ఈ వేరియంట్ భారత్లోకి కూడా ప్రవేశించింది. అయితే రోజురోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా మరో 69 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 530కి చేరుకుంది. మహారాష్ట్రలో మొత్తం 141 ఒమిక్రాన్ కేసులు ఉండగా, ఢిల్లీలో 79, కేరళలో 57, గుజరాత్లో 49, తెలంగాణలో 44, ఏపీలో 6 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్లలో తొలి ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించాయి. అంతేకాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలలో కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలుకు సూచించాయి.