క్రిమినల్ రికార్డులు ఉన్న నేతలే.. ప్రభుత్వాల్లో కీలక పదవులు చేపడుతున్నారు.. ప్రజలను పాలిస్తున్నారు.. అయితే, రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు… ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసి 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ రికార్డులను బయటపెట్టాలని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం… ఈ మేరకు జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరి 13వ తేదీన ఇచ్చిన తీర్పులో మార్పులు చేసినట్టు పేర్కొంది..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం.. సదరు అభ్యర్థే తమ ఎంపిక పూర్తయిన తర్వాత 48 గంటల్లోపు లేదా నామినేషన్ పత్రాలు వేసే తేదీకి రెండు వారాల ముందుగానే తమపై ఉన్న క్రిమినల్ రికార్డులను బయటపెట్టాలని పేర్కొంది.. కానీ, ఇప్పుడు ఆ ఆదేశాలకు మార్పులు చేస్తూ.. ఆయా పార్టీలే తమ అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను బయటపెట్టాల్సిందిగా కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను బయటపెట్టని పార్టీల గుర్తులను రద్దు చేయాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు… ఇవాళ తీర్పు వెలువరించింది..