NTV Telugu Site icon

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్క నాటిన శ్రీశ్రీ రవి శంకర్

మొక్కల యజ్ఞం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. సామాన్యుల నుంచి సాధువులు, గురువుల వరకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకుపోతున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ యోగ గురువు, ఆధ్యాత్మిక వేత్త ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపకులు శ్రీశ్రీ రవి శంకర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.

శంకర్ పల్లిలోని మానస గంగా ఆశ్రమంలో ఆయన ఉసిరి మొక్కను నాటారు. ఈ సందర్భంగాచెట్ల యొక్క ఔన్నత్యాన్ని చాటేలా, భారతీయ సంస్కృతిలో చెట్ల ప్రాముఖ్యతను తెలిపేలా ముద్రించిన “వృక్షవేదం” పుస్తకం గురించి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రతినిధి రాఘవ శ్రీ శ్రీ రవిశంకర్ కి వివరించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం మహోన్నతమైంది. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రకృతిని కాపాడాలనే వారి ఆలోచన అద్భుతమైందన్నారు.

చెట్లు రెండు రకాలు ఉంటాయి ఒకటి ఫలాలని కాస్తూ.. జీవుల ఆకలి తీర్చేవి, రెండు ఏపుగా పెరిగి జీవులకు నీడనిచ్చేవి. ఇవి రెండు మానవాళికి ఉపయోగకరమైనవే. అయితే జీవుల అవసరాలను గుర్తిస్తూ.. అందుకు అనుగుణంగా మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రతినిధులు చేస్తున్న తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బీసీ కమీషన్ ఛైర్మన్ వకుళా భరణం కృష్ణ మోహన్ రావు, మల్లికార్జున్ రెడ్డి, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” బాధ్యులు రాఘవతో పాటు ఆశ్రమ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.