NTV Telugu Site icon

ఒమిక్రాన్‌ టెన్షన్‌.. రాష్ట్రాలకు కేంద్రం తాజా వార్నింగ్..

భారత్‌లోనూ కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌.. భారత్‌లో అడుగుపెట్టడమే కాదు.. కొన్ని రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది.. ఈ తరుణంలో రాష్ట్రాలకు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. గతంలో భారత్‌తో పాటు అనేక దేశాలను అతలాకుతం చేసిన కోవిడ్‌ డెల్టా వేరియంట్‌ను మించి మూడురెట్ల వేగంతో వ్యాపిస్తోందని తెలిపింది.. ఒమిక్రాన్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచించిన కేంద్రం.. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.. ఇప్పటికే వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా డెల్టా వేరియంట్‌ ఉంది.. కానీ, వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌ అయిన ఒమిక్రాన్‌ అందుకు మూడు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ఆధారాలున్నాయని లేఖలో పేర్కొన్నారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌.

Read Also: డిసెంబర్‌ 20, బుధవారం రాశిఫలాలు…

ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తిస్తోన్న తరుణంలో.. అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తత, డేటా ఎనాలిసిస్, నిర్ణయాత్మకంగా వ్యవహరించడం మంచిదని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించిన కేంద్రం.. కంటైన్‌మెంట్‌ విషయంలో చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొంది.. ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల కొద్దిగా కనిపించినా.. ఆ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని లేఖలో పేర్కొన్నారు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌. జిల్లా, స్థానిక స్థాయిల్లో కంటెయిన్‌మెంట్‌ చర్యలను కట్టుదిట్టం చేయాలని.. అవసరమైన చోట్ల రాత్రి కర్ఫ్యూ విధించాలని… పెళ్లిళ్లు, ఉత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడకుండా నియంత్రించాలని.. వైరస్‌ బాధితుల హోం ఐసోలేషన్‌ సమయంలో నిబంధనలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. మరోవైపు, వ్యాక్సినేషన్‌ ప్రాధాన్యతను వివరిస్తూ.. డోర్‌ టు డోర్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని.. అర్హులైనవారందికీ ఫస్ట్‌, సెకండ్‌ డోస్‌ టీకా వేగంగా వేయాలని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.