యువతరం దేశానికి ఆధారం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సామాజిక సేవ చేయాల్సిన యువత వివిధ నేరాలకు పాల్పడి జైళ్ళలో మగ్గుతున్నారు. తెలంగాణ జైళ్ళలో మగ్గుతున్న యువత ధైన్యస్థితి పలువురిని కలచివేస్తోంది. తెలంగాణ జైళ్ళలో ఖైదీలుగా అధిక శాతం యువత జైలు గోడలకే పరిమితం అవుతున్నారు. వివిధ కారణాల వల్ల వారు నేరస్తులుగా మారారు.
2020 నేషనల్ క్రైం బ్యూరో రికార్డుల్లోని జైళ్ళ డేటాలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా విడుదల చేసిన నివేదికలో అధిక శాతం ఖైదీలు గా యువత వున్నట్టు అర్థం అవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 37 జైళ్లు వున్నాయి. జైళ్ళలో మొత్తం 6114 మంది ఖైదీలు వున్నారు. వీరిలో 1910 మందికి శిక్షలు ఖరారయ్యాయి. 3946 మంది అండర్ ట్రైల్ ఖైదీలుగా ఉన్నారు. శిక్ష పడిన 1910 మంది ఖైదీల్లో 40 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ,168 మంది గ్రాడ్యుయేట్లు వున్నారు. వీరిలో కరడు గట్టిన ఖైదీలు తక్కువే. క్షణికావేశంలో నేరాలకు పాల్పడి, జైలు జీవితం గడుపుతున్నవారు అనేకమంది వున్నారు. అండర్ ట్రైల్ ఖైదీలు గా 138 గ్రాడ్యుయేట్లు, 241 పోస్ట్ గ్రాడ్యుయేట్లు వున్నారు.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో వివిధ జైళ్ళలో ఆక్యుపెన్సీ రేట్ 77.3 శాతంగా వుంది. మొత్తం 6114 మంది ఖైదీల్లో 372 మంది మహిళా ఖైదీలు వున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఖైదీల సంఖ్య తక్కువేనని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదికలు చెబుతున్నాయి. మొత్తం జైళ్ళలో కెపాసిటీ 7845 , మహిళలు 703 కాగా 78 శాతం లోపే ఖైదీలు వున్నారు.
హర్యానాలో 94.9 శాతం, కర్నాటకలో 92.5 శాతం, అరుణాచల్ ప్రదేశ్లో 76 శాతం, పంజాబ్లో 73.3 శాతం, ఆంధ్రప్రదేశ్లో 69.5 శాతం, కేరళలో 61.1 శాతం, మిజోరాంలో 46.7 శాతం, త్రిపురలో 44.1 శాతం, తమిళనాడులో 43.5 శాతం, లడక్లో 32.5 శాతం, నాగాలాండ్లో 28.4 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ వుంది. మొత్తం ఖైదీల్లో తెలంగాణ జైళ్ళలో 12 శాతం మంది శిక్షలు ఖరారైన వారు, 23 శాతం మంది అండర్ ట్రయల్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారున్నారు. ఇద్దరు పాకిస్తాన్, ముగ్గురు నైజీరియన్లకు శిక్ష ఖరారయింది. మొత్తం అండర్ ట్రయల్స్లో ఇద్దరు పాకిస్తాన్, నలుగురు చైనా వారితో సహా 37 మంది విదేశీయులు వివిధ కారాగారాల్లో వున్నారు.