ఇకపై ఏపీ అసెంబ్లీలో మొబైల్ ఫోన్లు బంద్

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై ఆయన నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో ఇకపై అసెంబ్లీలోకి సభ్యులెవ్వరూ మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. ఇటీవల సభలో చంద్రబాబు మైక్ కట్ చేసిన సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతుండగా కొందరు టీడీపీ సభ్యులు ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఏపీ స్పీకర్ సభలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది.

Read Also: ఈటల సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్‌ ఆరిపోయే దీపం..!

మరోవైపు ఏపీ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. అంతకుముందు మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా జకియా ఖానమ్ ఎన్నికయ్యారు. దీంతో ఆమెను సీఎం జగన్ స్వయంగా పోడియం వద్దకు తీసుకువెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. అధ్యక్షా అని సంబోధించే స్థానంలో తన అక్క లాంటి వ్యక్తి కూర్చోవడం ఆనందంగా ఉందని జగన్ పేర్కొన్నారు. జకియా ఖానమ్ సాధారణ కుటుంబం నుంచి రాజకీయ నేతగా ఎదిగారని.. ఆమె డిప్యూటీ ఛైర్‌పర్సన్ స్థాయికి ఎదగడం మైనారిటీ మహిళలకు స్ఫూర్తిదాయకమని సీఎం జగన్ కొనియాడారు. కాగా తనకు డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం జగన్‌కు జకియా ఖానమ్ కృతజ్ఞతలు తెలిపారు.