ఏపీ అసెంబ్లీలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు.రెండోరోజునుంచే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలతో రెడీ అయ్యారు. వైసీపీ దూరంగా ఉంటున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో నిరసనకు దిగారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మైక్ ఇచ్చే వరకు అసెంబ్లీలో అడుగుతూనే ఉంటానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన నిరసన కొనసాగుతుందన్నారు. సమస్యలు పరిష్కరిస్తే సీఎంను అభినందిస్తా అని చెప్పారు. నాలుగేళ్లుగా సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగిపోయానని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:AP Budget Session: రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు… గవర్నర్ ప్రసంగంపై చర్చ
అయితే, కోటంరెడ్డి సభను అడ్డుకునేందుకే వచ్చారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శ్రీధర్రెడ్డిపై టీడీపీకి ఇప్పుడు ప్రేమ వచ్చిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ కోసం కోటంరెడ్డి పని చేస్తున్నారని అంబటి ఆరోపించారు.టీడీపీతో చేతులు కలిపి దురుద్దేశ్యంతోనే కోటంరెడ్డి ఆందోళన చేస్తున్నాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక విలువలేని వ్యక్తి శ్రీధర్రెడ్డి అని, చంద్రబాబు మెప్పుకోసం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ కూడా కోటంరెడ్డి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగత అంశాలకు సభలో చోటులేదని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే సంబంధింత మంత్రులు, అధికారులకు వినతిపత్రం ఇస్తే పరిష్కరిస్తాం అని చెప్పారు. ఎక్కడ ఏ వేదిక మీద ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలని మంత్రి బుగ్గన హితవు పలికారు.
కాగా, నెల్లూరు రూరల్ సమస్యలపై కోటంరెడ్డి పోరుబాట మొదలు పెట్టిన కోటంరెడ్డి.. నిన్నటి వరకు నెల్లూరులోనే ఆందోళన చేశారు. అయితే, తాజాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో సభ వేదికగా తన గళం విప్పుతున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కోటంరెడ్డి అసెంబ్లీకి వచ్చారు. తన నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతరాత్మ ప్రభోదానుసారo ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తానన్నారు.