NTV Telugu Site icon

మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న లిక్కర్‌ ధరలు..

మద్యంపై పన్ను రేట్లలో మార్పులు చేస్తూ మరోమారు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్, అదనపు ఎక్సైజు డ్యూటీ ప్రత్యేక మార్జిన్లల్లో హేతుబద్దత కోసం ఏపీ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాట్, అదనపు ఎక్సైజు డ్యూటీలో హేతుబద్దత ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గనున్నాయి. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వెరెటీలపై 5-12 శాతం మేర ధరలు తగ్గే అవకాశం ఉండగా, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకూ ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది.

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం, రాష్ట్రంలో నాటు సారా తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. వచ్చే వారంలో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లోనూ ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం విక్రయించేలా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల కారణంగా రాష్ట్రంలో 37 శాతం మేర మద్యం వినియోగం తగ్గిందని ఉత్తర్వుల్లో వెల్లడించారు. మద్యం స్మగ్లింగును అరికట్టేందుకే రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.