తెలంగాణలో అంపశయ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం ప్రకటించి ఊపిరి పోసిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించిన నాటి నుంచి విముఖతతో ఉన్న సీనియర్ నేతల్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఒకరు. అయితే ఆనాటి నుంచి మొన్నటి హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల వరకు రేవంత్రెడ్డిపై కోమటిరెడ్డి వ్యతిరేకంగానే వ్యాఖ్యలు చేశారు.
Also Read : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వ్యవసాయంపై కమిటీ..
కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కేడర్లో కూడా కొంచెం అస్పష్టత మొదలైందనే చెప్పాలి. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల తరువాత నిర్వహించిన పీఏసీ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ కాంగ్రెస్ నేతలందరికీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తల్లోకి ప్రతికూల సాంకేతాలు వెళుతున్నాయని గ్రహించిన పార్టీ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ల మధ్య సయోధ్య కుదిర్చే పనిని భుజానికెత్తుకున్నారు.
అయితే కోమటిరెడ్డితో మాట్లాడే బాధ్యత వీహెచ్ లాంటి సీనియర్లపైనే పెట్టారు. ఇదిలా ఉంటే.. ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ‘కర్షకుల కోసం కాంగ్రెస్’ అంటూ నేడు కాంగ్రెస్ వరి దీక్షలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద వరి దీక్షలు చేపట్టింది. అయితే దీక్షలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా పాల్గొనడంతో కొంత సేపు కార్యకర్తలందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనైయ్యారు.
అంతేకాకుండా కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి పక్కపక్కనే ఓకే ఫ్రేమ్లో కనిపించే సరికి ఇక కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నిండిందనే చెప్పాలి. ఎప్పటి నుంచో కొంత అస్పష్టతతో ఉన్న కార్యకర్తల్లోని అనుమానాన్ని ఈ రోజు వరి దీక్ష వేదిక నుంచి కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిలు తరిమికొట్టారని కాంగ్రెస్ సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు.