తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటన పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి, ఆర్మీ అధికారులకు సంతాపం వ్యక్తం చేశారు బండి సంజయ్.
మాతృభూమి రక్షణ కోసం రావత్ చేసిన సేవలు ఎనలేనివన్నారు బండి సంజయ్. రావత్ మరణం దేశానికి తీరని లోటన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అన్నారు బండి సంజయ్. ఈ దుర్ఘటన లో క్షతగాత్రుడై చికిత్స పొందుతున్న అధికారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు.
హెలికాప్టర్ ప్రమాదం విచారకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలడంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారు దేశం కోసం చేసిన సేవలు ఎనలేనివి సైన్యంలో దేశ భద్రత కోసం వివిధ హోదాల్లో పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు కిషన్ రెడ్డి. నిరంతరం దేశ సేవలో, దేశపౌరుల భద్రత కోసం ఉన్న వ్యక్తి. వారి మరణం దేశానికి తీరని లోటు అన్నారు. బిపిన్ రావత్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియ చేస్తూ వారి ఆత్మశాంతి కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అన్నారు కిషన్ రెడ్డి.