ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరల వ్యవహారం ఇప్పుడు హాట్టాపిక్గా మారిపోయింది.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇచ్చిన జీవోను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేయడంతో.. ఇది మరింత చర్చకు దారితీసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ను సంప్రదించిన సంగతి తెలిసిందే కాగా… ఇవాళ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. సినిమా టికెట్ల ధరలపై ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు.. గతంలో ఉన్న కమిటీలో లోటు పాట్లను సరి చేసి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక టిక్కెట్ల ధరల జాబితాను జాయింట్ కలెక్టర్కు పంపించాలని థియేటర్ యజమానులకు సూచించింది న్యాయస్థానం.. టిక్కెట్ల ధరలకు అనుగుణంగా పన్నులు చెల్లించాలని థియేటర్ యజమానులను ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు నాలుగు షోలు మాత్రమే వేయాలని స్పష్టం చేసిన హైకోర్టు.. ఈ కేసులో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
సినిమా టికెట్ల ధరలు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
