ఢిల్లీ శివారులో సుదీర్ఘ కాలంగా సాగుతోన్న రైతు సంఘాల ఆందోళన తాత్కాలికంగా వాయిదా పడింది.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడంతో పాటు.. రైతుల ఇతర డిమాండ్లపై కూడా సానుకూలంగా ఉండడం.. కనీస మద్దతు ధరపై పాజిటివ్గా ఉండడంతో.. ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కనీస మద్దతు ధరపై కేంద్రం నుంచి లేఖ వచ్చిందన్నారు బీకేయూ నేత రాకేష్ టికాయత్… ఇక, ఆందోళనల సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని లేఖలో ఉందని వెల్లడించిన ఆయన.. ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు రైతులకు ఎక్స్గ్రేషియాకు కూడా ఒప్పుకున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డిమాండ్లపై సానుకూలంగా స్పందించడంతో తాత్కాలికంగా ఆందోళనను విరమిస్తున్నట్టు ప్రకటించిన రైతులు.. ఈ నెల 11వ తేదీన రాజధాని ఢిల్లీ శివారులోని సింగూ సరిహద్దును ఖాళీ చేయనున్నట్టు తెలిపారు.
వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం, ఆందోళనకు సంబంధించిన అన్ని కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు నిరసన తెలిపిన రైతులు పెట్టిన అన్ని డిమాండ్లను కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో ఏడాదికి పైగా సాగిన నిరసన కార్యక్రమాలను విరమించారు.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో చర్చల తరువాత, దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులు ఎట్టకేలకు తమ ఉద్యమాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న రైతు సంఘాల వేదిక సంయుక్త కిసాన్ మోర్చా (SKM) నిన్న సాయంత్రం తమ ఆందోళనను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విరమిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ప్రభుత్వం సవరించిన చివరి కాపీని అందుకున్న తర్వాత మాత్రమే. ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించారు.
రైతుల డిమాండ్లు ఇలా ఉన్నాయి:
SKM లేదా సంబంధిత రైతు సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశపెడతామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు నిరసన తెలిపిన రైతులు తెలిపారు. అంతేకాకుండా, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు, పంజాబ్ తరహాలో, మరణించిన రైతుల బంధువులకు రూ. 5 లక్షల పరిహారం మరియు ఉద్యోగం అందించడానికి అంగీకరించాయి. చివరగా, రాష్ట్రాలు, కేంద్రం మరియు వ్యవసాయ నిపుణులతో పాటు – MSP కమిటీలో SKM నాయకులను మాత్రమే చేర్చాలనే డిమాండ్ కూడా నెరవేరింది. కాగా, నవంబర్ 29న శీతాకాల సమావేశాల మొదటి రోజున లోక్సభ మరియు రాజ్యసభ రెండూ వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ఆమోదించాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ప్రక్రియను పూర్తి చేసిన బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన ఆమోదం తెలిపారు. మొత్తంగా.. 2020 నవంబర్ 26 నుండి ఢిల్లీలోని వివిధ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే.