తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈ నెలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.. పాలక, ప్రతిక్షాలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. నువ్వా నేనా అనే పరిస్థితి హుజురాబాద్లో కనిపిస్తోంది.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించింది ఎన్నికల కమిషన్.. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించకూడదని, నిషేధం విధించినట్లు ఆర్.వి. కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇక, ప్రజా ప్రాతినిత్య చట్టం 1951, సెక్షన్ 126 (ఎ) ప్రకారం అక్టోబర్ 30వ తేదీ రాత్రి 7.30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్ నిర్వహించరాదని, ప్రింట్ మీడియాలో ప్రచురించరాదని, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రసారాలు చేయరాదని, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం నిషేధించినట్లు వెల్లడించారు.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అతిక్రమించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన, ప్రింట్ మీడియాలో ప్రచురించినా.. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారాలు చేసినా ఎన్నికల నిబంధనల మేరకు శిక్షార్హులని హెచ్చరించారు.