కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా రక్కసి ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత మళ్లీ పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు భారీ నమోదవుతున్నాయి. అయితే థర్డ్వేవ్లో ఎక్కువ మంది కరోనా బారినపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెల్లా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి శరవేగంగా ఉన్నందున కరోనా కేసుల భారీగా నమోదవుతున్నాయని వైద్యులు అంటున్నారు. అయితే తాజాగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోకి కూడా ఈ కరోనా వైరస్ ప్రవేశించింది. ఆలయ అర్చకులలో ఓ అర్చకుడికి కరోనా సోకింది. సదరు అర్చకుడికి స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది.
దీంతో ఆలయంలో మిగితా అర్చకులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అమ్మవారి దర్శనాల్లో కూడా మార్పులు చేశారు. అంతరాలయంలోకి భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. ఈ సందర్భంగా దుర్గమ్మ ఆలయ ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ.. ఆలయంలో క్యూలైన్లను ఎప్పటికప్పుడూ శానిటైజ్ చేస్తున్నామని, భక్తులు కూడా కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. ఏపీలో నైట్ కర్ఫ్యూకు అనుగుణంగా ఆలయ వేళ్లల్లోనూ మార్పులు చేస్తామని ఆమె వెల్లడించారు.