కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తితో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయి. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం కూడా ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించింది. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆలయాల్లో ప్రతి ఏడాది నిర్వహిస్తున్న కొన్ని కార్యక్రమాలను సైతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడిస్తున్నారు.
అయితే సింహాచలం అప్పన్న ఆలయంలో కోవిడ్ ఆంక్షలు తీవ్రతరం చేశారు. నేటి నుంచి అంతరాలయం దర్శనాలు, తీర్థం, అన్నప్రసాదము, ఉచిత ప్రసాదాల వితరణను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని సేవా టికెట్లు 50 శాతానికి తగ్గిస్తున్నట్లు, గంగాధర స్నానాలు నిషేధిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కనుమ రోజు జరగాల్సిన గ్రామ తిరువీధిని కూడా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.