వివిధ పార్టీల్లో మెంబర్ షిప్లు చాలా ఈజీగా లభిస్తాయి. మన పేరు చెప్పి వందో, రెండువందలో కడితే మెంబర్ షిప్, దానికి అదనంగా బీమా సదుపాయం కూడా లభిస్తుంది. అయితే, దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన పురాతన పార్టీ కాంగ్రెస్లో మెంబర్ షిప్ తీసుకోవడం అంత ఈజీగా కాదు.
పార్టీ సభ్యత్వం తీసుకోవాలనుకునే వారి కోసం కొత్త నిబంధనలను పార్టీ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, పార్టీ ప్రాథమిక సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారు కొన్ని నియమాలు పాటించాలి. మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణం చేయాలి. పార్టీ విధానాలను బహిరంగంగా ఎట్టి పరిస్థితుల్లో విమర్శించమని ప్రమాణం చేయాలి.
కొత్త ఫారం ప్రకారం సభ్యత్వ నమోదుకు ముందు.. కొత్త సభ్యులు కొన్ని వ్యక్తిగత వాగ్దానాలు చేయాలట. సభ్యత్వ కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి ప్రారంభించనున్నారు. ఇది వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతుంది. వచ్చే ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 20 వరకు కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఇటీవలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఈ నిర్ణయాలను ఆమోదించిన సంగతి తెలిసిందే. కొత్తగా సభ్యులు కావాలనుకునేవారికి ఎక్కువ ఆస్తి వుండకూడదు. సీలింగ్ చట్టం ఖచ్చితంగా పాటించాలి. పార్టీ విధానాలు, కార్యక్రమాలలో విధిగా పాల్గొనాలి. పార్టీ కోసం పనిచేయడానికి వెనుకాడకూడదట.
మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఖాదీ దుస్తులు ధరించడం అలవాటు చేసుకోవాలి. సామాజిక వివక్ష ఉండకూడదు. అందరినీ సమానంగా చూడాలట. సమాజంలో వివక్షను రూపుమాపేందుకు కృషి చేయాలి. కొత్త నిబంధనలు రాజ్యాంగంలో భాగమని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మధుసూదన్ మిస్త్రీ చెప్పడం విశేషం.
కొత్త, పాత సభ్యులందరూ అన్ని నియమాలను పాటించాలంటున్నారు. కాంగ్రెస్లో సభ్యత్వం కావాలనుకునేవారికి ఇన్ని నియమాలు పాటిస్తారా? మాకెందుకు మీ పార్టీ సభ్యత్వం అనుకుంటే మాత్రం మెంబర్ల సంఖ్య అంత పెరగకపోవచ్చు. రాజకీయంగా ఎదగాలని కాస్త మనీ పవర్, మజిల్ పవర్ వున్నవారే ఈ సభ్యత్వాన్ని స్వీకరిస్తారు.