రేపు గవర్నర్‌కి జగన్ పరామర్శ

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ని బుధవారం రాజ్‌భవన్‌లో ఆయన నివాసంలో పరామర్శించనున్నారు సీఎం జగన్. ఇటీవల కోవిడ్ నుండి కోలుకున్నారు గవర్నర్ దంపతులు. సతీసమేతంగా గవర్నర్ దంపతులను పరామర్శించనున్నారు సీఎం జగన్. కరోనా తర్వాత ఏర్పడిన ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ దంపతులు బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సుప్రవ హరిచందన్‌ గత గురువారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన సంగతి తెలిసిందే.

ఇంతకుముందు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్స తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకొని విజయవాడ వచ్చాక ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లి ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో రాజ్‌భవన్‌కు తిరిగి వచ్చారు. ఆయనను కలిసి ఆరోగ్యం గురించి తెలుసుకుంటారు వైఎస్ జగన్, భారతి.