కష్టాల కడలిలో ఉన్న తారలను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి ముందువరసలో ఉంటూ వస్తున్నారు. పలు తెలుగు సినిమాలలో ప్రత్యేకించి చిరంజీవి సినిమాలు ‘ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు’ తదితర చిత్రాల్లో విలన్ గా, ఫైటర్ గా నటించిన పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఇది తెలిసి చిరంజీవి వెంటనే స్పందించారు. ఆయన కిడ్నీ మార్పిడి కోసం రెండు లక్షలను పొన్నాంబళం బ్యాంకు అకౌంటుకు బదిలీ చేశారు. పొన్నాంబళం చెన్నైలో ఉంటూ కిడ్నీ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. చిరంజీవి చేసిన సాయం తెలుసుకున్న పొన్నాంబళం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.’అన్నయ్యా… మీ సాయం మరువలేను. నా కిడ్నీ మార్పడికి మీరు పంపిన రెండు లక్షలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సహాయాన్ని నేనెప్పటికీ మరచిపోలేను. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఆ ఆంజనేయస్వామి మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలి. జై శ్రీరామ్’ అంటూ తన సందేశాన్ని తమిళంలో వీడియో ద్వారా తెలియచేశారు పొన్నాంబళం.