Site icon NTV Telugu

తెలంగాణలో వలస కార్మికులకు రూ.330 కోట్ల కేంద్ర నిధులు

కరోనా మహమ్మారి వేళ కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన కింద తెలంగాణలోని లక్షలాదిమంది వలస కార్మికులకు సాయం అందించింది. 1.84 లక్షల మంది వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తూ రూ.102.66 కోట్లు ఖర్చుపెట్టింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద1.73 లక్షల వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తూ రూ.102.69 కోట్లు కేంద్రం వెచ్చించిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి స్పష్టం చేశారు.

దీనికి అదనంగా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు రూ.124.55 కోట్లు విడుదల చేసిందని, దీనివల్ల 8.30 లక్షల భవన నిర్మాణ కార్మికులు లబ్ధి పొందారని చెప్పారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలంగాణలోని వలస కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ఖర్చు చేసిన నిధులపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. వలస కార్మికుల కోసం మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, కరోనా విపత్తు కాలంలో అదనంగా మరిన్ని చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు.

కరోనా వేళ ఆత్మనిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన కింద దేశవ్యాప్తంగా 39.51 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. తత్ఫలితంగా ఈపీఎఫ్ ఖాతాల్లో అదనంగా రూ.2583 కోట్లు జమయ్యాయని తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 38.91 లక్షల మంది చిరు ఉద్యోగులకు రూ.2567 కోట్లు ప్రయోజనం చేకూర్చామన్నారు. భవన నిర్మాణ, ఇతర కార్మికుల కోసం రూ.7413 కోట్ల సాయం అందించామని మంత్రి తెలిపారు.

అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద 50.78 కోట్ల మానవ పనిదినాలు సృష్టించామన్నారు. దీనికి రూ.39,293 కోట్ల ఖర్చు చేశామన్నారు. ఇంకా పీఎంస్వనిధి కింద రుణాలు, ప్రతి వ్యక్తికి అదనంగా నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందించామన్నారు. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు ద్వారా రూ.124.55 కోట్లు కలిపి మొత్తం రూ.329.90 కోట్లు కేంద్రం వెచ్చించిందని మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు.

Exit mobile version