మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల అన్వేషణకు బ్రేక్ పడింది… తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకూ ఆయుధాల కోసం తవ్వకాలు నిలిపివేయాలంటూ మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది సీబీఐ… దీంతో, రోటరీపురం, గరండాల వాగు వద్ద తవ్వకాలు నిలిపివేశారు.. బారికేడ్లు తొలగించి పోలీసుల పికేటింగ్ను ఎత్తేశారు అధికారులు.. ఇక, ఆ రహదారి గుండా యథావిథిగా ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్నారు.. కాగా, మూడు రోజుల పాటు తవ్వకాలు చేసినా ఆయుధాలు లభించలేదు.. మురికి నీటిని తొలగించి జెసీబీ యంత్రాల సహాయంతో వ్యర్థపు మట్టిని తొలగిస్తూ అన్వేషణ సాగింది.. మున్సిపల్ సిబ్బంది, 26 మంది తీవ్రంగా శ్రమించినా ఆయుధాల జాడ కనిపించలేదు.
మరోవైపు.. పులివెందుల కేంద్రంగా వైఎస్ వివేకా కేసులో సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతోంది.. మరోమారు పలువురు అనుమానితులను విచారించే అవకాశం కనిపిస్తోంది.. కస్టడిలో ఉన్న సునీల్ ఇచ్చిన ఆయుధాల సమాచారంతో సందిగ్ధంలో పడ్డ సీబీఐ అధికారులు.. మరోమారు ఆయుధాల సమాచారంపై విచారించే అవకాశం కనిపిస్తోంది.. ఇక, నిన్న తవ్వకాలను పరిశీలించిన ఆయుధాల అన్వేషణపై ఆరా తీశారు వివేకా కుమార్తె సునీత.. పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సీబీఐ అధికారులను కలిసి కేసు పురోగతిపై కూడా ఆమె ఆరా తీశారు.. నిన్న ఎనిమిది మంది అనుమానితులను ప్రశ్నించింది సీబీఐ.. కోడిగుడ్ల వ్యాపారి సంపత్, ఎర్రంరెడ్డిపల్లెకు చెందిన జగదీష్ రెడ్డి, యుసీఐఎల్ ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డి, పార్మసిస్ట్ మణి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ లతో పాటు సిఎస్ఐ చర్చి సిబ్బందిని కూడా విచారించారు సీబీఐ అధికారులు.