ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడిని అరికట్టేందుకు జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్దంగా డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తే పది రెట్లు పెనాల్టీ విధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రెండోసారి ఇదే తప్పిదానికి పాల్పడితే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం కేసులు పెడతామని స్పష్టం చేసింది ఏపీ సర్కార్. అటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 50 లేదా అంతకు మించి పడకలున్న ఆస్పత్రులు తప్పని సరిగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సర్కార్ ఆదేశించింది. 50-100 పడకలున్న ప్రైవేట్ ఆస్పత్రులు 500 LPM కెపాసిటీ ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది.
100 కు పైగా పడకలున్న ప్రైవేట్ ఆస్పత్రులు 1000 LPM కెపాసిటీ కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రతి బెడ్డుకూ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, సిలిండర్లు తప్పకుండా ఉండాలని ప్రభుత్వం సూచనలు చేసింది. 50 బెడ్ల కంటే తక్కువ బెడ్లు ఉన్న ఆస్పత్రులు కూడా ప్రతి బెడ్డుకూ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, సిలిండర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రులకు అవసరమైన ఆక్సిజన్ ను అందిస్తోంది ప్రభుత్వం. అలాగే ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటులో 30 శాతం సబ్సిడీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.